ఐపీఎల్ క్రికెట్ దిగ్గజంలో ఒకరైన సురేశ్ రైనా.. తాజాగా ఐపీఎల్కు గుడ్ బై చెప్పాడు. రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన రైనా.. ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఓవర్సీస్ టీ20 లీగ్స్లో ఆడేందుకు, రైనా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఓవర్సీస్ టీ20 లీగ్స్లో ఆడాలంటే.. బీసీసీఐ నిబంధనల ప్రకారం, ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోవాలి. అందుకే.. ఐపీఎల్కి అతడు గుడ్ బై చెప్పేశాడు.
‘‘ఇన్నేళ్లపాటు ఈ దేశం, నా రాష్ట్రం ఉత్తరప్రదేశ్కు సేవలు అందించినందుకు గర్వంగా భావిస్తున్నా. క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నా. నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన బీసీసీఐ, యూపీసీఏ, చెన్నై టీమ్, రాజీవ్ శుక్లా, నా అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా’’ అంటూ రైనా తన ట్వీట్లో రాసుకొచ్చాడు. మరో రెండు, మూడేళ్లు క్రికెట్ ఆడాలనుకుంటున్నానని చెప్పిన రైనా.. సెప్టెంబర్ 10న ప్రారంభమయ్యే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో ఆడుతున్నానని తెలిపాడు. దక్షిణాఫ్రికా, శ్రీలంక, యూఏఈ దేశాలకు చెందిన ఫ్రాంచైజీలు కూడా సంప్రదిస్తున్నాయని.. క్లియరెన్స్ వచ్చాక అందరికీ సమాచారం ఇస్తానన్నాడు.
కాగా.. ఐపీఎల్ టాప్ స్కోరర్లలో ఐదో స్థానంలో ఉన్న రైనా, చెన్నై సూపర్ కింగ్స్తో సుదీర్ఘ ప్రయాణం చేశాడు. అయితే.. 2022 ఐపీఎల్ మెగా వేలంలో అతడు అమ్ముడుపోలేదు. టీమిండియా తరఫున 266 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్ట్ మ్యాచ్లు ఆడిన రైనా.. మొత్తంగా 7988 పరుగులు నమోదు చేశాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం గురించి బీసీసీఐ సెక్రటరీ జై షా, రాజీవ్ శుక్లాలకు సమాచారం ఇచ్చానన్నాడు.