Virat Kohli Reacts On His Form And Criticism: ఇన్నాళ్లూ తన ఫామ్లేమి, తనపై వస్తున్న విమర్శల మీద మౌనంగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత నోరు విప్పాడు. తన ఆట ఎలాంటిదో తనకు తెలుసని, తనకు సామర్థ్యం ఉంది కాబట్టే ఇక్కడిదాకా రాగలిగానని అన్నాడు. ‘నా ఆట ఎలా ఉందో నాకు తెలుసు. అంతర్జాతీయ క్రికెట్లో వైవిధ్యమైన బంతులతో ఇబ్బంది పెట్టే బౌలర్లు ఎందరో ఉంటారు. వాటికితోడు.. ఎన్నో ప్రతికూల పరిస్థితులూ ఉంటాయి. అవన్నీ ఎదుర్కొనే సామర్థ్యం ఉంటేనే.. ఇక్కడిదాకా రాగలము. ప్రస్తుత గడ్డు దశను నేను సులువుగా దాటేస్తాను’ అని కోహ్లీ అన్నాడు.
ఇదే సమయంలో 2014 నాటి ఇంగ్లండ్ పర్యటన గురించి కూడా కోహ్లీ ప్రస్తావించాడు. ‘ఇంగ్లండ్ టూర్లో కొన్ని తప్పిదాలు జరిగాయి. అవేంటో తెలుసుకున్నాను. ఎక్కడ తప్పు జరుగుతుందో గ్రహించి.. దాన్ని సరిదిద్దుకున్నాను. ఇప్పుడు కూడా నేను బాగానే బ్యాటింగ్ చేస్తున్నా. ఒక్కసారి తిరిగి రిథమ్లోకి రావాలంతే! అప్పుడు ఇంకా మెరుగ్గా రాణించగలను. కాబట్టి, ఇప్పుడున్న గడ్డు పరిస్థితి అనేది అసలు సమస్యే కాదు. ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపళ్లాలుంటాయి. అందుకు నేను అతీతం కాదు. అయితే, ఈ గడ్డు పరిస్థితి నన్ను భయపెట్టలేదు. నా అనుభవాలు నాకెంతో నేర్పించాయి, ఇంకా నేర్పిస్తున్నాయి కూడా! కచ్చితంగా ఈ దశను నేను సులువుగా అధిగమిస్తా’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.
కాగా.. చాలాకాలం నుంచి కోహ్లీ ఫామ్లేమితో సతమతమవుతున్న సంగతి తెలిసిందే! అతడు సెంచరీ చేసి వెయ్యి రోజుల పైనే అవుతోంది. అయితే.. ఆసియా కప్లో మాత్రం కోహ్లీ అదరగొడతాడని అందరూ ఆశిస్తున్నారు. ముఖ్యంగా.. ఆగస్టు 28వ తేదీన పాకిస్తాన్తో జరగనున్న మ్యాచ్లో తప్పకుండా చెలరేగిపోతాడని భావిస్తున్నారు. మరి.. అభిమానుల అంచనాలకి తగ్గట్టు కోహ్లీ తిరిగి ఫామ్లో వస్తాడా? లేదా? అనేది వేచి చూడాలి.