నేడు మునుగోడులో సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభ.. భారీ బందోబస్తు

0
118

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తోన్న మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఇవాళ సీఎం కేసీఆర్‌ మునుగోడు మండల కేంద్రంలో జరిగే ప్రజా దీవెన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నగరం నుంచి రహదారి మార్గంలో భారీ కాన్వాయ్‌తో మధ్యాహ్నం రెండు గంటలకు మునుగోడుకు చేరుకుని, అక్కడే మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటూ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యనేతలతో సీఎం సమావేశమైన తరువాత భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. మరోవైపు ఈ సభలోనే పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటిస్తారనే టాక్. అయితే దీనిపై పార్టీ వర్గాల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వం పట్ల టీఆర్ఎస్ అధిష్ఠానం మొగ్గు చూపుతుందనే వార్తల నేపథ్యంలో అన్ని మండలాల్లోనూ అసమ్మతి నేతలు ఇప్పటికే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.

ఇక ఈ సభ అనంతరం నియోజకవర్గంలోని సర్పంచిలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసి, అందరి నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే అభ్యర్థిపై సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం వుంటుందని విశ్వనీయ సమాచారం. అయితే.. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక నేపథ్యంలోనూ రెండు నెలలు ముందుగా కృతజ్ఞతాసభ పేరుతో అధికార తెరాస హాలియాలో సీఎం సభను ఏర్పాటు చేసింది. ఉపఎన్నిక నవంబరులో ఉంటుందనే అంచనాల నేపథ్యంలో ఇప్పుడూ అదే మాదిరిగానే పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో నియోజకవర్గానికి హామీల వర్షం కురిపిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ఇవాళ సీఎం కేసీఆర్‌ సభ రోజే నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు పాదయాత్ర చేయడం, అందులోనూ రేవంత్‌రెడ్డి పాల్గొనుండటంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here