తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన మూడు వారాల్లోనే కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా ఏడు రెట్లు పెరిగాయి. కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గక పోవడంతో ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రోజున 493 మందికి పాజిటివ్గా తేలింది. గురువారంతో పోల్చుకుంటే హైదరాబాద్ జిల్లాలో సుమారు 50 కేసులు అధికమయ్యాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కోలుకున్న వారి రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నిన్నటి రోజైన శుక్రవారం 99.07 శాతం నమోదు కావడంతో భయాందోళన చెందుతున్నారు. అయితే మరోవైపు 219 మంది కోవిడ్ బారినుంచి సురక్షితంగా బయటపడ్డారు. నిన్న నగరంలో 366 కేసులు, రంగారెడ్డిలో 40, మేడ్చల్ మల్కాజిగిరిలో 34 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కు, శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని, కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు అధికారులు .
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డీపీహెచ్ శ్రీనివాసరావు ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రకటించారు. ఒకవైపు కరోనా కేసులు, మరోవైపు డెంగ్యూ వ్యాపిస్తుండటంతో.. ప్రజలు జాగ్రతగా ఉండాలని సూచించారు. నగరవాసులు ఖచ్చితంగా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు కరోనా కేసులు పెరుగుతున్నాయని.. అయినా కూడా ప్రమాదం లేదు.. కానీ.. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని రానున్న 7, 8 నెలల్లో కోవిడ్ పూర్తీగా తగ్గిపోతుందని డీపీహెచ్ శ్రీనివాసరావు ప్రజలకు తెలిపారు. అయితే కరోనాతో పిల్లలకు మొదటి నుంచి ఇబ్బంది లేదని, కొవిడ్ పాజిటివ్ వచ్చినా జలుబు, దగ్గు వంటి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని వివరించారు. కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నందున స్కూల్కు వెళ్లే పిల్లలు ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించే విధంగా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని సూచించారు.
కోవిడ్ కేసులపై జపాన్కు చెందిన టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఊపిరితిత్తులపై దాడి చేస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసుల్లో బీఏ-2, బీఏ-4, బీఏ-5 ఎక్కువగా ఉంటున్నాయని, అందులో బీఏ-4, బీఏ-5 వేరియంట్లు నేరుగా ఊపిరితిత్తుల కణాలపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు. కావున ప్రజలందరు దీని బారినుంచి తగు జాగ్రత్తు తీసుకోవాలని సూచిస్తున్నారు.