రాజస్థాన్లో భారీ ఆపరేషన్ నిర్వహించిన సైబరాబాద్ పోలీసులు నలుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. సైబర్ నేరాల ద్వారా కొట్టేసిన డబ్బులతో వ్యాపారాలు చేస్తూ.. బిజినెస్మెన్లుగా కొనసాగుతున్నారు సైబర్ కేటుగాళ్లు. జంట నగరాల్లో వేల మంది నుంచి కోట్ల రూపాయలను కొట్టేసింది ఈ ముఠా. అయితే.. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో పోలీసులు డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. మార్కెట్ బాక్స్ అని ట్రేడింగ్ యాప్ ద్వారా అమాయకులను మోసం చేశారని వెల్లడించారు. రాజస్థాన్,యూపీ కి చెందిన నలుగురు సైబర్ నేరగాళ్ల ను అరెస్ట్ చేసామని, పెట్టుబడులు, ట్రేడింగ్ పేరుతో ఈ సైబర్ నేరగాళ్లు కోట్లు కొల్లగొట్టినట్లు సీపీ వెల్లడించారు. నలుగురు నిందితుల నుంచి రూ.9 కోట్ల 81 లక్షల నగదు రికవరీ చేసామని, ఇంత పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్ల నుండి డబ్బు రికవరీ చేయడం దేశంలోనే మొదటి సారి అని ఆయన వివరించారు.
సైబర్ నేరగాళ్లు అభిషేక్ జైన్ , పవన్ కుమార్ ప్రజాపత్, ఆకాష్ రాయ్, కృష్ణ కుమార్ లను అరెస్ట్ చేసామని, యాప్ ను అభిషేక్ జైన్ డెవలప్ చేశాడని, ఈ యాప్ సెబీలో రిజిస్టర్ చేసుకోలేదన్నారు. ఇప్పటివరకు ఈ యాప్ లో 3000 మంది ట్రేడర్స్ రిజిస్టర్ చేసుకున్నారని, ‘ Market Box/MB’ , www.marketbox.in పేరుతో ట్రేడింగ్ అప్లికేషన్ ను తయారు చేసి..వాట్సాప్ , టెలిగ్రాం యాప్ ల ద్వారా ప్రమోట్ చేసినట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అయితే.. ప్రజలు ఇలాంటి యాప్లతో మోసపోవద్దని, అన్ని విషయాలను తెలుసుకోవాలని స్టీఫెన్ రవీంద్ర సూచించారు. రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో.. సైబర్ నేరగాళ్ల గురించి తెలుసుకోవడం ఎంతైన ఉత్తమం.