Governor Tamilisai to meet Basara IIIT students: బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు వార్తల్లో నిలుస్తున్నాయి. వరసగా వర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు నిరసన, ఆందోళనలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోవడంతో పాటు.. సిబ్బంది కొరత, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం వంటి పలు సమస్యలపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల నిరసనలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే.. తాజాగా బాసర ట్రిబుల్ ఐటి విద్యార్థులు గవర్నర్ తమిళి సైని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో విద్యార్థుల సమస్యలను స్వయంగా పరీక్షించేందుకు బాసరకు శనివారం (నిన్న) రాత్రి బయలు దేరారు గవర్నర్. నిజామాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రోడ్డుమార్గాన ట్రిపుల్ ఐటీకి గవర్నర్ బయలు దేరారు. ముందుగా బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే గవర్నర్ ను ఇంచార్జ్ వీసీ వెంకటరమణ స్వాగతం పలికారు. బాసర ట్రిబుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకోనున్నారు గవర్నర్ తమిళిసై. ట్రిబుల్ ఐటీ విద్యార్థులతో భోజనం అనంతరం, అధికారులతో మాట్లాడనున్నారు గవర్నర్.
గత నెల నుంచి విద్యార్థులు సరైన సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కాగా విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినా.. సదుపాయాల్లో మాత్రం మార్పు రాలేదు. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. ఇందులో సంజయ్ అనే విద్యార్థి చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. ఇటీవల ఇంజనీరింగ్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు కొత్త క్యాటరర్ ను నియమించానలి డిమాండ్ చేస్తూ మూడు పూటలు భోజనాన్ని బహిష్కరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని కోరుతూ.. రెండు రోజుల క్రితం ఇన్చార్జి వైస్ ఛాన్సలర్ వీ వెంకట రమణ ఛాంబర్ ఎదుట నిరసన చేపట్టారు. గత వారం విద్యార్థులు భోజనం చేయకుండా.. జాగారం చేసి నిరసన చేపట్టారు. ఇప్పటికే తెలంగాణ సీఎం, అధికార టీఆర్ఎస్ పార్టీకి గవర్నర్ ఆఫీసుకు మధ్య దూరం ఏర్పడింది. ఇటు గవర్నర్ బహిరంగంగానే ప్రభుత్వంపై తన అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నాయకులు కూడా గవర్నర్ తీరును తప్పుబడుతున్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. తాజాగా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, గవర్నర్ ని కలవడంపై టీఆర్ఎస్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.