అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనంతో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జనం ఇండ్లకే పరిమితమయ్యారు. వాగులు, వంకలు ఉధృతంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలుతెగిపోయాయి. గ్రామాల్లోకి నీరు చేరడం తో ఇద్దరూ గర్భిణీలను బోట్ సహాయంతో డీఆర్ఎఫ్ టీమ్ సేఫ్ ప్లేస్ లోకి తరలించారు.ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించి వరదల పైనా సమీక్ష చేశారు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షము కురుస్తుంది భూపాలపల్లి ములుగు.. మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జనం ఇండ్లకే పరిమితమయ్యారు. విరామం లేకుండా పడుతున్న వర్షానికి 163వ జాతీయ రహదారిలో ఏటూర్నాగారం మీదుగా చత్తీస్గఢ్కు వెళ్లే ప్రధాన రహదారిలో ఉధృతంగా వరదలు ప్రవహిస్తుండటంతో చత్తీస్గఢ్కు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. మహాదేవపూర్ పలిమెల మండలానికి పూర్తిగా బాహ్య సంబంధాలు తెగిపోయాయి. పెద్దవాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రధాన రహదారి కొట్టుకుపోవడం వలన రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద పెరగడంతో ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. కాళేశ్వరం వద్ద మేడిగడ్డ లక్ష్మి బ్యారేజి వద్ద 8,95,330 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 81 గేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చిన ట్లుగానే యధావిధిగా కిందకు పంపిస్తున్నారు. తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజి దగ్గర 59 గేట్లు ఎత్తినీటిని క్రిందకు వదిలారు.
మరో వైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ – పలిమెల గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తండటంతో ప్రధాన రహదారి తెగిపోయి పలిమెల-మహాదేవ్పూర్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సోమవారం రోజున ఇద్దరు గర్భిణీలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాగు దాటిచ్చి జిల్లా కేంద్రానికి తరలించారు.పలిమెల మండలం లెంకల గడ్డకు చెందిన మడప పుష్పలత, సర్వాయిపేటకు చెందిన పాగే రాధిక అనే ఇద్దరు గర్భిణీలను ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా ఆస్పత్రికి తీసుకెళ్లాయి. మూడు రోజులుగా పడుతున్న వర్షము తో బొగ్గు ఉత్పత్తి కి అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి జిల్లాలోని ఓపెన్ కాస్టు బొగ్గు ఉత్పత్తికి నిలిచిపోయింది భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఓపెన్ కాస్టులలో 18వేల టన్నుల ఉత్పతి నిలిచిపోయింది. అదేవిధంగా మల్హర్ మండలం తాడిచర్ల ఓపెన్ కాస్టులో మూడు రోజుల నుంచి 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతోపాటు 3లక్షల70వేల క్యూబిక్ మట్టి వెలికితీత పనులు నిలిచిపోయినట్లు సమాచారం.