హైదరాబాద్లోని అమ్నీషియా పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలికపై సామూహిక అత్యాచార నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టులో కాకుండా సాధారణ న్యాయస్థానంలో విచారణ జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి సమగ్ర ఆధారాలతో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఒకట్రెండు రోజుల్లో న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనున్నట్లు తెలిసింది. అయితే.. ఇప్పటికే నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ జువెనైల్ జస్టిస్ బోర్డు అనుమతి ఆధారంగా తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఇక రెగ్యులర్ న్యాయస్థానంలో విచారణ జరిగి నిందితులపై నేరం రుజువైతే కఠినశిక్షపడే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది మే28న జూబ్లీహిల్స్లోని అమ్నేషియా అండ్ ఇన్సోమ్నియా పబ్ నుంచి ఒక బాలికను తీసుకెళ్లి ఆరుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈకేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయగా, ఒకరు మినహా అయిదుగురు మైనర్లుగా తేలడంతో.. వారిని జువైనల్ హోంకు తరలించారు. ఈనేపథ్యంలో.. ఈ కేసులో నిందితులకు బెయిల్ లభించింది. అయితే నిందితులది క్రూరమైన చర్యగా భావించి వారికి జువెనైల్ కోర్టులో కాకుండా సాధారణ కోర్టులో విచారించేలా చర్యలు తీసుకోవాలని గతంలోనే పోలీసులు జేజేబోర్డును ఆశ్రయించారు. అయితే.. సాధారణంగా 16 ఏళ్లు దాటిన బాలలుగనక క్రూరమైన నేరాలకు పాల్పడితే మేజర్లుగా పరిగణించి సాధారణ న్యాయస్థానంలో విచారణ జరిపించేందుకు సిద్దమైనట్లు సమాచారం.