మరోసారి సీఎం కేసీఆర్పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రచారార్భాటానికి కోట్ల రూపాయల ప్రజాధనం వ్రుధా అవుతోందంటూ ఆరోపణ చేశారు. దేశవ్యాప్త పత్రికలకు, తాజాగా ప్రభుత్వ ప్రచారానికి.. తాజాగా హైదరాబాద్ లోనూ కల్వకుంట్ల చేసుకుంటున్న సొంత ప్రచారానికి కోట్ల రూపాయల ప్రజల సొమ్మును వాడుకుంటున్నాడని ఆరోపించారు మధుయాష్కీ. అంతేకాకుండా.. రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోక ప్రజల సొమ్మును తన సొంత ప్రచారాలకు ఖర్చు చేస్తున్నాడని మండిపడ్డారు మధుయాష్కీ. మౌలిక వసతులు లేక మొన్న బాసర విద్యార్థులు చేసిన ధర్నాలు చూశాము.. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాల్లోనూ అదే పరిస్థితులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ప్రచార యావ కోసం పెడుతున్న ఖర్చును రైతుల ఆత్మహత్యలు నివారించడం కోసమో, లేక ట్రిపుల్ ఐటీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ కళాశాలల మౌలిక వసతుల కోసం ఖర్చు చేస్తే కొంతలో కొంతైనా ప్రజలకు మేలు జరిగేదని మధుయాష్కీ హితవు పలికారు. మీడియాకిస్తున్న ప్రకటనల ప్రజలసొమ్మును ప్రజా అవసరాల కోసం, పేదల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం ఖర్చు చేస్తే పేదలకు ఆసరా దొరికేదని, ప్రజలకట్టిన పన్నుల ద్వారా ఖజానాకు వచ్చిన సొమ్మును కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ప్రచార సోకుల కోసం ఖర్చు పెట్టడాని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు మధుయాష్కీ . ప్రభుత్వ కళశాలల్లోనూ, యూనివర్సిటీల్లోనూ మౌలిక వసతుల కల్పన కోసం వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నానని మధుయాష్కీ తెలిపారు.