ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్ ఇప్పుడు దేశంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనూ మంకీపాక్స్ కలకలం సృష్టించింది. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈనెల 6న కువైట్ నుంచి రాగా.. అతనికి జ్వరం, శరీరంపై దద్దుర్లతో బాధపడుతున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.అనుమానిత వ్యక్తిని ఈరోజు హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉండడంతో, అతన్ని హైదరాబాద్లోని ఫీవర్ హాస్పిటల్కు తరలిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వ్యక్తి జులై 6వ తేదీన కువైట్ నుంచి వచ్చారు. 20వ తేదీన అతనికి జ్వరం, 23వ తేదీ నాటికి దద్దుర్లు రావడంతో మరుసటి రోజు ఉదయం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు వెళ్లాడు.
అక్కడి డాక్టర్ మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ్నుంచి 108లో అతన్ని అక్కడి నుంచి తరలిస్తున్నామని… ఇక్కడ సాంపిల్ సేకరించి, పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపిస్తామని వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. అంతవరకు ఫీవర్ ఆస్పత్రిలో ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందజేస్తామని.. ఈ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించామని.. వాళ్లెవరికీ లక్షణాలు లేవని, అయినప్పటికీ వారిని ఐసోలేట్ చేసినట్లు తెలిపింది. ప్రజలు మంకీపాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది ప్రాణాంతక వ్యాధి కాదంటూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.