హైదరాబాద్లో రెండు రోజుల పాటు గడపనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రేపు హైదరాబాద్ రానున్న ఆయన.. ఎల్లుండి భారీ బహిరంగసభలో ఉపన్యాసం చేయనున్నారు.. అయితే, రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా మారిపోయింది పరిస్థితి.. ఇరు పార్టీల మధ్య ఫ్లెక్సీలు, హోర్డింగుల వార్ నడుస్తోంది. మోడీ రాకను వ్యతిరేకిస్తూ గులాబీ పార్టీవాళ్లు క్రియేటివ్గా హోర్డింగులను ఏర్పాటుచేస్తున్నారు. ‘సాలు మోడీ.. సంపకు మోడీ’ అని రాసి ఉన్న బ్యానర్లను, హోర్డింగ్లు ఇప్పటికే నగరంలోని పలు చోట్ల ఏర్పాటు చేశాయి టీఆర్ఎస్ శ్రేణులు… ఇది హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాలేదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి ఫ్లెక్సీలే దర్శనమిచ్చాయి. అయితే, వాటిని వెంటనే అధికారులు, సిబ్బంది తొలగించారు.
ఇప్పుడు హైదరాబాద్లో మరో హోర్డింగ్ చర్చగా మారింది.. దొంగల ముఠా ఫొటో పెట్టి దానిపై ‘మిస్టర్ ఎన్.మోడీ.. మేం బ్యాంక్లను మాత్రమే దోచేస్తాం.. కానీ, మీరు ఈ దేశాన్ని మొత్తాన్ని దోచేస్తారు.. అని రాశారు. అయితే, ఈ భారీ ఫ్లెక్సీలను ఎవరు పెట్టారో తెలియాల్సి ఉంది.. ఇక, వెంటనే వాటిని తొలగించారు అధికారులు. కాగా, తెలంగాణలో సీఎం కేసీఆర్, ఆయన మంత్రులు ఆలీబాబా 40 దొంగల ముఠాలా తయారయ్యారంటూ కమలదళం రెండు రోజుల కిందట ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ పాలనకు రాష్ట్ర ప్రజలు రాంరాం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని కూడా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ని ఇంటికి సాగనంపాలని పిలుపునిస్తూ ‘చాలు దొర.. సెలవు దొర’ అనే పేరుతో టీ-బీజేపీ ఒక ప్రత్యేక వెబ్ సైట్ను ప్రారంభించింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ కూడా సరిగ్గా అవే వ్యాఖ్యలతో బీజేపీ విమర్శలను తిప్పకొడుతోంది. ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను కూడా ఆలీబాబా దొంగల ముఠాతో పోల్చుతూ లేటెస్టుగా హోర్డింగ్ పెట్టారు. ఆ ప్రచార చిత్రంపైన అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ పేరు లేనప్పటికీ అది ఆ పార్టీవాళ్ల పనేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదంటూ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ తారా స్థాయికి చేరుకుంది.