హైకోర్టులో తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి ఎదురుదెబ్బ తగిలింది.. 2018 ఎన్నికల్లో ఎన్నిక సక్రమంగా లేదని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్ధి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేసిన ఎలక్షన్ పిటిషన్పై విచారణ కొనసాగనుంది.. ఆ పిటిషన్ను డిస్మిస్ చేయాలనంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్.. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు వింది.. ఆ తర్వాత ఇవాళ తీర్పు వెలువరించింది.. మంత్రి కొప్పుల ఈశ్వర్ వేసిన పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టు పేర్కొంది.. దీంతో, హైకోర్టులో మంత్రి కొప్పులకు ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.
కాగా, మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్యాయంగా గెలిచారని ధర్మపురి కాంగ్రెస్ ఇన్చార్జ్ అడ్లూరి లక్ష్మణ్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.. తన సీటును లాగేసుకున్నారన్నారు. ధర్మపురి అసెంబ్లీ ఓట్లను మళ్లీ లెక్కించాలని డిమాండ్ చేశారు.. కౌంటింగ్ కోసం కొప్పుల ఈశ్వర్ పిటిషన్ వేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరుతున్నారు.. న్యాయం జరగకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ గతంలోనే ఆయన సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. అంతేకాదు తనకు ఏదైనా జరిగితే సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు అడ్లూరి లక్ష్మణ్.