సిద్దిపేట జిల్లాలో జరిగిన కారు ప్రమాదం విషాదం మిగిల్చింది. కొండపాక మండలం జప్తి నాచారం శివారులో ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. బావిలో పడ్డ కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా.. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా మరొకరు కారులోనే ఇరుక్కుపోయి చనిపోయారు. బావిలో పడ్డ కారు, యాదగిరి కోసం ఆరుగంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. సిద్దిపేట జిల్లా సిరిసినగండ్లకు చెందిన వెంకటస్వామి తన బావలను ఇంటికి తీసుకురావడానికి కారు తీసుకుని కొండపాకకి బయలుదేరాడు. అక్కడ తన బావలు కనకయ్య, యాదగిరిలను కారులో ఎక్కించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా కారు అదుపు తప్పింది. ఈ సమయంలో కారు అతివేగంతో ఉండటంతో రోడ్డు పక్కనే ఉన్న పాడుబడిన బావిలోకి కారు దూసుకెళ్లింది. వెంటనే గమనించిన స్థానికులు వెంకటస్వామి, కనకయ్యలను బయటికి తీసి ప్రాణాలు కాపాడారు. వీరిద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారులో చిక్కుకున్న సూరంపల్లికి చెందిన యాదగిరి కారుతో పాటు బావిలో పడి మృతిచెందాడు. దాదాపు ఆరుగంటల పాటు కష్టపడి కారుని, యాదగిరి మృతదేహన్ని బయటకు తీశారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.