ఒకప్పుడు తెలంగాణలో టీడీపీకి ఎంతో ఆదరణ వుండేది. పరిస్థితుల ప్రభావం.. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ జెండా అంతగా కనిపించడం లేదు. వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనతో తెలుగు తమ్ముళ్ళలో ఉత్సాహం పెరిగింది. పసుపు దళం అధినేత రాకతో మనసు ఉండపట్టలేక గులాబీ నేతలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ముత్తూగూడెం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఘనస్వాగతం లభించింది. సత్తుపల్లి, పినపాక భద్రాచలంలో చంద్రబాబు కు అపూర్వ స్వాగతం పలికారు. అర్ధరాత్రయినా అదే అభిమానం కనిపించింది.
గోదావరి వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన చంద్రబాబు బాధిత కుటుంబాలను పరామర్శించారు. చంద్రబాబును చూసిన లోకల్ గులాబీ తమ్ముళ్ళలో ఆనందం కట్టలు తెంచుకుంది. ఒకప్పుడు పసుపు తమ్ముళ్ళు.. ఇప్పుడేమో గులాబీ తమ్ముళ్ళలా మారారు. పేరుకే గులాబీ తమ్ముళ్ళు. గుండెల నిండా పసుపు. ఒక్కసారిగా వారు చంద్రబాబును చూసి బాగా హడావిడి చేశారు. గులాబీ నేతల ఆదేశాలను పక్కన పెట్టి తమ అభిమానం చాటుకున్నారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి నేతల సలహాలను కూడా పట్టించుకోలేదు.
ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు టీడీపీ శ్రేణులతో కలిసి చంద్రబాబు రాకకోసం ఎదురుచూడడం కనిపించింది. బాబు రాక ఆలస్యం అయినా ఆయనకు అభివాదం చేసి అక్కడినించి బయలుదేరి వెళ్లిపోయారు. పెనుబల్లి మండలం ముత్తగూడెం,పెనుబల్లి,సత్తుపల్లి, అశ్వారావుపేట, ప్రాంతాలనుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. రాత్రి 10 గంటల తరువాత పినపాక నియోజకవర్గం నుంచి ఎంటర్ అయి భద్రాచలం చేరుకున్నారు చంద్రబాబు. రాత్రి అక్కడే బసచేశారు. బూర్గంపహాడు, భద్రాచలం ప్రాంతాల్లో అనూహ్యంగా చంద్రబాబుకి నీరాజనాలు పలికారు. ఈ జనాన్ని చూసిన చంద్రబాబుకి ఉత్సాహం ఉప్పొంగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఆయన గురువారం రాత్రి పర్యటించారు. ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా ఏపీ లోని వెలేరుపాడు, కుకునూరు మండలాల్లో పర్యటించి తెలంగాణలోని బూర్గంపాడు మండలంలోకి ప్రవేశించారు. మండలంలోని గ్రామాల్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనుకున్న సమయానికి ఐదారు గంటలు ఆలస్యమైనా టీడీపీ నేతలు, రజలు వేచి చూసి బ్రహ్మారథం పట్టారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు ముందుచూపుతో వివరించాలన్నారు. బూర్గంపాడులో పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మేక వెంకట నరసయ్య కుటుంబానికి టీడీపీ తరపున లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ముంపు బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పదివేల ఆర్థిక సాయం ఇంకా అందక పోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. తామ ముందు చూపుతో వ్యవహరించి కర కట్ట కట్టడం వలన భద్రాచలానికి వరద ముంపు తప్పిందన్నారు. టీడీపీని ఇదే రీతిలో ఆదరించాలని చంద్రబాబు సూచించారు.