‘మీ సేవ’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలకు గుర్తింపుగా.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణకు అవార్డు దక్కింది. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘ఎకనమిక్ టైమ్స్’ ఈ అవార్డ్ని ప్రసాదించింది. గురువారం న్యూ ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన డిజిటెక్ కాంక్లేవ్ 2022లో.. ఈ అవార్డును మంత్రి కేటీఆర్ అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసిన నివేదికలు.. అలాగే క్షేత్రస్థాయిలో జరిపిన విస్తృత పరిశోధన, అధ్యయనం ఆధారంగా.. ఈ అవార్డుకు తెలంగాణ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే.. వ్యాపారాన్ని సులభతరం చేయడం(ఈవోడీబీ)లో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత్తమంగా ఉన్నాయని ఆ మేగజైన్ ప్రశంసించింది. ‘మీ సేవ’ పోర్టల్ ద్వారా ప్రజలకు మెరుగైన డిజిటల్ సేవలను అందిస్తున్నారని కూడా కొనియాడింది.
ఈ సంధర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న మీసేవ కార్యకలాపాల్లో తీసుకువచ్చిన మార్పుల గురించి వివరించారు. ముఖ్యంగా.. మొబైల్ ఆధారిత ప్రభుత్వ సేవలు, కాంటాక్ట్లెస్ గవర్నెన్స్ దిశగా చేపడుతున్న కార్యక్రమాలు, టీ-వాలెట్ సాధించిన మైలురాళ్లను తెలియజేశారు. టీఎస్ ఐపాస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు, అలాగే టీఎస్ బీపాస్లో చేసే దరఖాస్తుల అనుమతుల్ని.. వరుసగా 15, 21 రోజుల్లో పొందవచ్చని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈవోడీబీ ర్యాంకుల్లో తెలంగాణ ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉందన్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తూనే ఉందని, ఇందుకు ఎకనామిక్ టైమ్స్ పురస్కారమే నిదర్శనమని అన్నారు.