ఇవాళ తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. నేడు ఉదయం 11:30 గంటలకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. అయితే.. తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో బాలికలు తమ సత్తాను చాటారు. బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించి విజయభేరి మోగించగా.. బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రయివేటు విద్యార్థుల్లోనూ బాలికలదే పైచేయి. బాలికలు 58.76 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 46.21 శాతం పాసయ్యారు. 3,007 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 15 పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పదిహేను స్కూల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.
అయితే.. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది పరీక్షలకు హాజరు కాగా.. 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈనేపథ్యంలో.. మొత్తంగా టెన్త్ ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ప్రయివేటు విద్యార్థుల విషయానికి వస్తే 819 మంది హాజరు కాగా, 425 మంది పాసయ్యారు. 51.89 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే.. ఈ ఏడాది మే 23 నుంచి జూన్ 1 వరకు పది పరీక్షలు నిర్వహించగా 5,08,143 రెగ్యులర్ విద్యార్థులకు మొత్తం 5,03,114 మంది ఎస్సెస్సీ పరీక్షలు రాయగా 167 మంది ప్రయివేటు విద్యార్థులకు 87 మంది పరీక్షలకు హాజరయ్యారు.