టీఎస్ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ఉదయం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో.. ఇంజినీరింగ్లో 80.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా.. అగ్రికల్చర్లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అయితే.. ఎంసెట్ ఫలితాలు విడుదలైన క్రమంలో కౌన్సెలింగ్ షెడ్యూల్ను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొదటి విడుత షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 21 నుంచి 29 వరకు ఆన్ లైన్లో విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే.. ఆగస్టు 23 నుంచి 30 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈనెల 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు, సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు ప్రకటనలో వెల్లడించారు.
అదేవిధంగా.. రెండో విడుత షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 30న రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్, సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు, అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. మూడో విడుత షెడ్యూల్లో.. అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ఉంటుందని, అక్టోబరు 13న మూడో విడత ధృవపత్రాల పరిశీలన ఉంటుందని, అక్టోబరు 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని, అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుందని.. అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.