తెలంగాణలో వరదలు సంభవించిన విషయం తెలిసిందే. గత వారం భారీగా వర్షాలు కురియడంతో రాష్ట్రంలోని పలు గ్రామాలు వరదనీటిలో మునిగిపోయాయి. అయితే రెండు రోజుల తరువాత మళ్లీ తెలంగాణలో భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఆరోగ్య శాఖ, 24 గంటలూ పనిచేసే వార్రూమ్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం 90302 27324, 040-24651119 హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎనిమిది జిల్లాల్లోని నీట మునిగిన ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య బృందాలు వైద్య సేవలందిస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ జిల్లాల్లో ప్రజారోగ్య పరిరక్షణ చర్యలను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక వార్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ వార్ రూమ్ హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసి ప్రజలు సహాయం పొందవచ్చని తెలిపారు వైద్య శాఖ అధికారులు.