హైదరాబాద్ నార్సింగీలో ఓ చిన్నారిని కిడ్నాప్ చేయబోతున్న దుండగుడ్ని ఒక మహిళ ధైర్యంగా అడ్డుకుంది. మాయమాటలు చెప్పి, నోరు మూసి ఆ చిన్నారిని కిడ్నాపర్ ఎత్తుకెళ్తుంటే.. అది గమనించిన మహిళ ‘ఎందుకు చిన్నారి నోరు మూశావ్’ అంటూ గట్టిగా అరుస్తూ నిలదీసింది. ఆ పాపని వదిలెయ్ అంటూ నిలదీసింది. దాంతో ఉక్కిరిబిక్కిరి అయిన ఆ కిడ్నాపర్.. మహిళని తోసేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు.
ఇంతలోనే స్థానికులు అతడ్ని పట్టుకొని, చెట్టుకు కట్టేశారు. అందరూ కలిసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలికి చేరుకొని, కిడ్నాపర్ను స్టేషన్కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాపర్ వద్ద కత్తి ఉందని, గట్టిగా అరిస్టే చంపేస్తానంటూ బెదిరించాడని పోలీసులకు స్థానికులు తెలిపారు.
కాగా.. ఈమధ్య కిడ్నాప్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రెండు వారాల క్రితమే.. మహబూబ్నగర్లో 13 నెలల చిన్నారి కిడ్నాప్కు గురి కావడం తీవ్ర సంచలనం రేపింది. జులై 1వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు ఆ పాపని కిడ్నాప్ చేశారు. ఈ కేసుని సీరియస్గా తీసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్లో ఆటోకి సంబంధించిన క్లూ ఆధారంతో ఛేదించారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఒంటరిగా బయటకు పంపొద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.