బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. తెలుగులో తొలి మూడు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సందర్భంగా బుధవారం నాడు చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నారు. బ్రహ్మాస్త్ర మూవీలో నంది అస్త్రంగా నాగార్జున తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలపై ఆసక్తికరంగా స్పందించారు. ఒకప్పుడు సినిమా రివ్యూలు ఒక వారం తర్వాత పత్రికలు, మ్యాగజైన్లలో వచ్చేవి అని.. కానీ అప్పటికి ఆ సినిమా ఉందో లేదో కూడా తెలిసేది కాదన్నారు. అప్పట్లో రివ్యూలను జనం పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదన్నారు. కానీ ఇటీవల సోషల్ మీడియా పరిధి పెరిగిపోయిందని.. సినిమా టాక్లో రివ్యూలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని నాగార్జున అన్నారు.
తాను ఐఎండీబీ రేటింగ్లను ఫాలో అవుతుంటానని.. ఐఎండీబీ రేటింగ్ 7 కంటే ఎక్కువ ఉన్న సినిమాలను తాను చూస్తానని నాగార్జున తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాయ్కాట్ ట్రెండ్ నడుస్తోందని.. అయితే ఆ ట్రెండ్ ముఖ్యం కాదని.. సినిమాలో కంటెంట్ ఉంటే ఆ ట్రెండ్ను పట్టించుకోమని బ్రహ్మాస్త్రతో ప్రేక్షకులు నిరూపించారన్నారు. నెగిటివ్ టాక్ వస్తేనే సినిమా ఫ్లాప్ అవుతుందని.. కంటెంట్ ఉన్న సినిమాలను ప్రజలు ఆదరిస్తున్నారని నాగార్జున గుర్తుచేశారు. గంగుభాయ్ కతియావాడి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, భూల్ భూలయ్యా-2 , పుష్ప వంటి సినిమాలు హిందీలో ఆడాయంటే కంటెంట్ కారణమని.. కానీ లాల్ సింగ్ చద్దాలో కంటెంట్ సరిగ్గా లేదని.. పైగా నెగిటివ్ టాక్ సినిమా ఫలితంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. తాను బిగ్బాస్లో కంటెస్టెంట్గా వెళ్లే ప్రసక్తే లేదని నాగార్జున స్పష్టం చేశారు. ఈ షోలో ఇటీవల నారాయణ..నారాయణ అనే పదాన్ని సరాదాగానే అన్నానని.. గత రెండు సీజన్లలోనూ తాను ఈ పదాన్ని వాడినట్లు నాగ్ గుర్తుచేశారు. తాను ఈ పదాన్ని ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదన్నారు.