అమెరికాలోని హ్యూస్టన్లో ప్రముఖ ప్రవాసాంధ్రుడు డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ కుటుంబంలో జరిగిన తీవ్ర విషాదంపై నాట్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.. శ్రీనివాస్ భార్య వాణి, ఆయన ఇద్దరు కుమార్తెలు వాలర్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న పెద్ద కుమార్తెను దసరాకు ఇంటికి తీసుకురావడానికి వాణీ, ఆమె చిన్న కుమార్తె వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న లెక్సస్ కారును షెవీ పికప్ ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరిని ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.
శ్రీనివాస్ కుటుంబానికి జరిగిన ప్రమాద విషయం తెలిసి ఆయన సన్నిహితులు, మిత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. శ్రీనివాస్కి నాట్స్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపింది. నాట్స్ బోర్డు డైరక్టర్గా పనిచేసిన శ్రీనివాస్ కొడాలికి నాట్స్తో బలమైన అనుబంధం ఉండటంతో.. ఆయన కుటుంబంలో జరిగిన దుర్ఘటన పట్ల నాట్స్ ప్రతినిధులు, సభ్యులంతా తమ సానుభూతిని తెలిపారు. డా. కొడాలి కుటుంబంలో తీవ్ర విషాదం పట్ల పలువురు ఎన్నారైలు విచారం వ్యక్తం చేశారు.