బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆరోపించారు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు బీజేపీ నియంతృత్వానికి, అణచివేతకు నిదర్శనమన్నారు. ప్రశ్నించే గొంతులపై బీజేపీ ఉక్కుపాదం మోపుతుందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పై అనర్హత వేటు వేయడం బీజేపీ నియంతృత్వానికి, అణచివేతకు నిదర్శనం, ప్రశ్నించే గొంతులను నొక్కేయడమే నని తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామిక పార్లమెంట్ వ్యవస్థలో ఈ రోజు చీకటి రోజని, పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యం ను బీజేపీ ఖూనీ చేసిందన్నారు.
రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడవడమేనన్నారు. పరువునష్టం కేసులో వేసిన శిక్షకే అనర్హత వేటు వేస్తే క్రిమినల్ కేసులలో శిక్షలు పడ్డ బీజేపీ ఎంపీలు వున్నారు మరి వాళ్ళ సంగతేంటి? అని ఆయన ప్రశ్నించారు. వారిపై ఇప్పటిదాకా ఎందుకు అనర్హత వేటు వేయలేదని, ప్రతిపక్షాలను అణిచివేయడమే లక్ష్యంగా బీజేపీ పాలన సాగుతున్నదన్నారు. దేశాన్ని దోచుకునే దొంగల కోసమే బీజేపీ పని చేస్తుందన్నారు. బీజేపీని వ్యతిరేకించిన ప్రతిపక్షాలపై ఐటీ, ఈడి, సీబీఐ దాడులు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందని, ఇలాంటి చర్యలను ప్రజాస్వామిక వాదులు, ప్రజలు ఖండించాలన్నారు. బీజేపీ కి తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.