ఆసియా కప్లో మరో ఆసక్తికర సమరం జరగబోతోంది. వరుసగా రెండో ఆదివారం కూడా దాయాది దేశాలు తలపడబోతున్నాయి. సూపర్-4లో భాగంగా భారత్-పాకిస్థాన్ మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ మ్యాచ్లో టీమిండియాలో పలు మార్పులు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా జడేజా జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో జడేజా స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి రానున్నాడు. అటు టాప్-5 బ్యాటర్లలో అంతా రైట్ హ్యాండర్స్ ఉన్న నేపథ్యంలో రిషబ్ పంత్కు చోటివ్వడం కూడా అనివార్యమైంది. పంత్ జట్టులోకి వస్తే దినేష్ కార్తీక్ చోటు గల్లంతు కానుంది. ఈ ఇద్దరిని ఆడించే పరిస్థితి జట్టులో లేదు కాబట్టి కార్తీక్కు ఉద్వాసన తప్పేటట్టు లేదు.
మరోవైపు హాంకాంగ్తో మ్యాచ్లో తేలిపోయిన పేస్ బౌలర్ అవేష్ ఖాన్ స్థానంలో స్పిన్నర్ రవి బిష్ణోయ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎక్స్ట్రా పేసర్కు బదులు టీమ్ మేనేజ్మెంట్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ జట్టులోకి రానుండగా.. యుజ్వేంద్ర చాహల్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా కొనసాగనున్నాడు. భువనేశ్వర్, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యాతో కలిసి పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు.