ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు సీబీఐకి అప్పగిస్తే సంబరాలు చేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. దొంగల ముసుగులు తొలగిపోయాయని,
స్కామ్ లోని స్వామీజీలతో సంబంధం లేదన్న వాళ్ళు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. మాకు సంబంధం లేదని భుజాలు తడుముకున్నోళ్లు… దొంగలను భుజాలపై మోస్తున్నారన్నారు కేటీఆర్. కుట్ర కేసు తమ జేబు సంస్ధ సీబీఐకి చిక్కినందుకే కిషన్ రెడ్డి సంబరమా అని ప్రశ్నించారు కేటీఆర్. ఒకప్పుడు సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్… ఇప్పుడు సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అయిందని ఆయన ఎద్దేవా చేశారు. సీబీఐ దర్యాప్తుతో పాటు దొరికిన దొంగలపై నార్కో అనాలసిస్, లైడిటెక్టర్ టెస్టులకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలపై బీజేపీపై ప్రజాక్షేత్రంలో ఎప్పుడో విచారణ ప్రారంభమైందని, తమ అసమర్ధ పాలనతో ప్రజాక్షేత్రంలో బీజేపీనే బద్నాం అయిందన్నారు. కేసు సీబీఐకి వెళ్తే క్లీన్ చిట్ ఇవ్వడం పక్కా అని పబ్లిక్గా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. సీబీఐ సహా వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించిన తీరుకు మీ నిస్సిగ్గు ప్రకటనలే నిదర్శనమన్నారు. ఒకప్పుడు సీబీఐకి కేసు వెళ్తే.. భయపడే పరిస్థితి.. నేడు సంబురాలు చేసుకుంటున్నారు. సీబీఐ సంస్థను బీజేపీ ఎంతగా నీరుగార్చిందో అర్థమవుతోందన్నారు.