టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీ ఈనెల 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు తగ్గట్లే భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే ఈ మూవీకి గతంలోనే భారీ ఓటీటీ ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. లైగర్ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దాదాపు రూ.200కోట్లు ఆఫర్ చేసిందని.. కానీ మేకర్స్ ఈ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారని టాక్ నడుస్తోంది. సినిమాపై తమకున్న నమ్మకం వల్లే ఓటీటీ ఆఫర్ను నిర్మాతలు వద్దనుకున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బాయ్కాట్ లైగర్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో సినిమా ఎంతమేరకు హిట్ అవుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ సినిమాలు ఈ కారణంగానే తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి లైగర్ కూడా చేరుతుందా లేదా లైగర్ టాక్ ఆఫ్ ఇండస్ట్రీ స్థాయిలో హిట్ అవుతుందా అనే విషయం ఆసక్తికరంగా మారింది.
కాగా లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్గా నటించింది. మైక్ టైసన్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని కరణ్జోహర్, ఛార్మీతో కలిసి పూరీ జగన్నాథ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో విడుదలవుతోంది. ఈ సినిమాలో క్లైమాక్స్ అద్భుతంగా వచ్చిందని దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రమోషన్లలో చెప్పి అంచనాలను పెంచేస్తున్నాడు. పుష్ప సినిమా క్లైమాక్స్ తనకు ఎంతో నచ్చిందని.. అలాగే ఇప్పుడు లైగర్ మూవీ క్లైమాక్స్ కూడా అంతే కొత్త అనుభూతి ఇస్తుందని పూరీ అంటున్నాడు. ఇప్పటికే లైగర్ నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు, ట్రైలర్కు విశేష స్పందన వచ్చింది.