సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహించి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. నీతి ఆయోగ్ స్పందిస్తూ.. సీఎ కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నీతి అయోగ్ రాజకీయ ప్రకటన చేసిందని మండిపడ్డారు. అంతేకాకుండా.. బీజేపీకి వంత పాడుతూ నోట్ రిలీజ్ చేసిందని, ఇది నీతి అయోగ్ కి సిగ్గుచేటన్నారు. నీతి అయోగ్ ప్రకటన అర్ధ సత్యాలని ఆయన ఆరోపించారు. సీఎం ఒక్క ప్రశ్నకు సమాధానం లేదని, 3982 కోట్లు ఇచ్చినా తీసుకోలేదని నీతి అయోగ్ చెప్పిందని, వందల సార్లు మేము లేఖ రాసినా నిధులు విడుదల చేయలేదన్నారు హరీష్ రావు. ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తారా అంటూ హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎర్రబెల్లి, స్మిత సబర్వాల్, సీఎస్ లేఖలు రాశారని, ఉలుకు పలుకు లేదని, మళ్లీ అబద్ధాలు ఎందుకు ? అంటూ ధ్వజమెత్తారు మంత్రి హరీష్ రావు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రాల హక్కులు నీతి అయోగ్ కాపాడాలని, పక్క దారి పట్టించేందుకు నోట్ విడుదల చేయవద్దన్నారు. కేసీఆర్ నీతి అయోగ్ కి చాలా సార్లు వెళ్లారని, వెళ్లి చెప్పినా అరణ్య రోదన అంటూ వివరించారు. అక్కడ పట్టించుకునే దిక్కు లేదని, బాయ్ కట్ అనేది తీవ్ర నిరసన అని ఆయన తెలిపారు. అరగంటలో నే నోట్ ఇచ్చారని, సీఎం బాయ్ కట్ నిర్ణయం తీవ్ర ఒత్తిడి పెంచుతుందని, ఇప్పటికైనా మారతారని భావిస్తున్నామన్నారు. న్యాయమైన వాటా ఇస్తారని ఆశిస్తున్నామని, సెస్ తగ్గించుకుంటారు అని అనుకుంటున్నామన్నారు. లక్ష్యాలు కాగితాలకే పరిమితం కాకూడదని మంత్రి హరీష్ రావు అన్నారు.