సికింద్రాబాద్లో ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో అగ్ని ప్రమాద నివారణ చర్యలపై సమీక్ష చేపట్టారు మంత్రి కేటీఆర్.. అనుమతులు లేని భారీ భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఈ సమావేశంలో కేటీఆర్తో పాటు.. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ తదితరలు పాల్గొన్నారు.. పలు ప్రతిపాదనలు, సూచనలు చేశారు మంత్రులు.. హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని ఇతర అన్ని ప్రధాన నగరాలలో భారీ/ ఎత్తైన భవనాలకు ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు.. వ్యాపార, వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఎత్తైన అపార్టుమెంట్లలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి.. ఫైర్ సేఫ్టీ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే ప్రస్తుత ఫైర్ సేఫ్టీ చట్టాలను మార్చాలని సూచించారు కేటీఆర్.
హైదరాబాద్ లో వస్తున్న భారీ అంతస్తుల భవన నిర్మాణాల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ విషయంలో డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికతలను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలన్నారు కేటీఆర్.. ఈ మేరకు పాశ్చాత్య దేశాలతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న ఆదర్శవంతమైన పద్ధతుల పైన అధ్యయనాన్ని వేగంగా చేపట్టి సూచనలు ఇవ్వాలని మంత్రులు ఆదేశించారు.. ప్రస్తుతం ఉన్న ఫైర్ సేఫ్టీ శాఖ సిబ్బందికి మరిన్ని శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని.. ఫైర్ సేఫ్టీ శాఖకు అవసరమైన ఆధునిక సామాగ్రిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం శాఖకు అవసరమైన అత్యవసర సామాగ్రి విషయానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.. అగ్ని ప్రమాద నివారణలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భవనాల యజమానులను కూడా భాగస్వాములను చేసుకునే అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు.. ఇక, ఇటీవల సికింద్రాబాద్లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ముగ్గురికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్-గ్రేషియా అందించనున్నట్టు ప్రకటించారు.