విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరైన సూపర్స్టార్ రజనీకాంత్.. ఓవైపు ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపిస్తూనే.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.. ఎన్టీఆర్ నటన, రాజకీయాలు అన్నీ చెప్పుకొచ్చారు.. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నటసింహ నందమూరి బాలకృష్ణపై ప్రశంసలు కురిపించారు.. అయితే, హీరో రజనీకాంత్ పై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. రజనీకాంత్ సినిమాల్లో సూపర్ స్టార్.. కానీ, రాజకీయాల్లో మాత్రం అవగాహన లేని వ్యక్తి అని పేర్కొన్నారు. సొంతంగా గెలిచే సత్తా లేకే చంద్రబాబు.. రజనీకాంత్, బాలకృష్ణ, గరుడ శివాజీలను తెర మీదకు తెస్తున్నాడని సెటైర్లు వేశారు.. అయితే, ఎంత మంది రజనీకాంత్లు వచ్చినా ప్రజలు నమ్మరు.. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం.. మరోసారి వైఎస్ జగనే సీఎం అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అవగాహన లేని వ్యక్తి రజనీకాంత్.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పుడు రజనీకాంత్ కూడా చంద్రబాబుతో చేతులు కలిపాడన్న విషయం అందరికీ తెలుసన్నారు. అటువంటి వ్యక్తి వచ్చి ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పిస్తాననటం ఆశ్చర్యంగా ఉంది.. విజన్ 2047 అంటే ఏంటో నాకు అర్దం కాలేదని ఎద్దేవా చేశారు. తలైవీ సినిమాల్లో కోట్లు సంపాదిస్తాడు కాబట్టి ఆయనకు ఇబ్బంది లేదు.. కేసీఆర్ కట్టినట్లు ఎందుకు శాశ్వత సచివాలయం కట్టలేకపోయాడు చంద్రబాబు ? అని ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో గరుడా శివాజీ రాలేదా? రజనీకాంత్ వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. సినిమా యాక్టర్లు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తారు.. ప్రజలకు అవగాహన ఉండటంతోనే గత ఎన్నికల్లో 23 స్థానాలకు చంద్రబాబును పరిమితం చేశారన్నారు. సింగల్ గా పోటీ చేసే దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి జగన్.. నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా తిట్టిన చంద్రబాబు విజన్ ఇప్పుడు మారిపోయిందా? అంటూ సెటైర్లు వేశారు వెల్లంపల్లి శ్రీనివాస్.
ఇక, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల వేదికగా సూపర్స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. రజనీకాంత్కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని విమర్శలు గుప్పించిన ఆమె.. ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందని పేర్కొన్నారు.. ఎన్టీఆర్పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు రజనీకాంత్తో అబద్ధాలు చెప్పించారని ఫైర్ అయ్యారు.. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమన్నారో.. రజనీకాంత్కు వీడియోలు ఇస్తానన్న రోజా.. ఎన్టీఆర్ అభిమానులను బాధపట్టేలా రజనీ మాట్లాడారనా విమర్శించారు.. ఇక, చంద్రబాబు విజన్, హైదరాబాద్ అభివృద్ధిపై రజనీ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చిన రోజా.. చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డే అన్నారు.. దానికి కారణం చంద్రబాబు కాదని రజనీకాంత్ తెలుసుకోవాలని సూచించారు మంత్రి రోజా. ఇక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియింబర్స్మెంట్ తెచ్చింది వైఎస్సార్.. చంద్రబాబు కాదని హితవుపలికారు మంత్రి రోజా.. చంద్రబాబు విజన్ 2020 వల్ల టీడీపీ 23 సీట్లకు పరిమితమైందని ఎద్దేవా చేసిన ఆమె… విజన్ 2047కి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజనీకాంత్కి తెలుసా..? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ శతజయంతి వేదికగా చేసిన కామెంట్లతో రజనీకాంత్పై తెలుగు ప్రజలకు ఉన్న గౌరవం తగ్గించుకున్నారు. ఇంతలా మాట్లాడేవారు 27 ఏళ్లలో ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదు. ఎన్టీఆర్ యుగపురుషుడు అన్న వారు ఎందుకు వెన్నుపోటు పొడిచారు?. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. మరోవైపు.. రజనీకాంత్ చెప్పినట్టు 2024లో చంద్రబాబు సీఎం అయ్యే అవకాశమే లేదని జోస్యం చెప్పారు మంత్రి ఆర్కే రోజా.
కాగా, నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు.. సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిధిగా పాల్గొన్న విషయం విదితమే.. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్న రజనీకాంత్.. ఈ సభలో జనాన్ని చూస్తుంటే రాజకీయం మాట్లాడాలని అనిపిస్తోంది. కానీ, అనుభవం వద్దురా రజనీ రాజకీయం మాట్లాడొద్దంటోంది. కానీ ఎన్టీఆర్ గురించి రాజకీయం మాట్లాడక తప్పడం లేదు. ఎన్టీఆర్ నటించిన సినిమాలు అమోఘం. ఎన్టీఆర్ తో టైగర్ సినిమా చేశాను. ఎన్టీఆర్ నన్నెంతో ప్రభావితం చేశారు.. నేను చూసిన మొదటి సినిమా పాతాళభైరవి.. అప్పుడు నాకు ఆరేళ్లు ఉంటాయి.. నేను హీరోగా చేసిన తొలి సినిమా పేరు భైరవి. యాదృచ్చికమైన నాకు అది ఎంతో ఆనందాన్ని కలుగజేసిందని పేర్కొన్న విషయం విదితమే. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు నాకు 30 ఏళ్లుగా మిత్రుడు.. చంద్రబాబు ఐటీ విజన్ ఏంటో ప్రపంచానికి తెలుసు. గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడని అప్పుడే అనుకున్నాను. చంద్రబాబు పెద్ద విజనరీ.. చంద్రబాబు విలువ ఇక్కడ ఉన్నవాళ్లకంటే.. బయట ఉన్న వాళ్లకే తెలుసు. ఎప్పుడూ అభివృద్ధి గురించే చంద్రబాబు మాట్లాడేవారు. హైదరాబాద్లో సైబరాబాద్ సైడ్ వెళ్లాను.. హైదరాబాద్కు వస్తే ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్లో ఉన్నానో అర్థం కాలేదు. హైదరబాద్ అభివృద్ధి అవ్వడంతో చంద్రబాబు పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. చంద్రబాబు విజన్ 2047 సాకారం అవుతుందని రజనీకాంత్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.