పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావని, పీడీఎఫ్, ఇతర వామ పక్షాలకు చెందిన ఓట్లే టిడిపి వైపు మళ్ళాయన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నిటినీ కలిపి చూడాలి. ఏం రకంగాను ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకత ను ప్రతిఫలించవు. టిడిపి సంబరాలు చేసుకోవటంతోనే అంతా అయిపోలేదు. ఈ ఫలితాలను మేము హెచ్చరిక గా భావించడం లేదు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదన్నారు సజ్జల.
ఒక వర్గం ఓటర్లను మొత్తానికి ఎలా అపాదిస్తారు?మేము అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రులు ఓటర్లలో లేరు. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షా 30 వేల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. మొన్ననే కానిస్టేబుల్ పోస్టులకు రిక్రూట్మెంట్ కూడా చేశాం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా టిడిపి పోటీ చేసింది. తెలంగాణ తరహాలోనే ప్రయత్నాలు టిడిపి చేయొచ్చు అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదిలా ఉంటే. టీడీపీ నేతలు వైసీపీ పై మండిపడుతున్నారు.
ఈ ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అన్నారు సీనియర్ టీడీపీ నేత నేత ధూళిపాళ్ల నరేంద్ర. వైసీపీ ప్రభుత్వానికి విద్యావంతులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ,అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకొని అక్రమ విజయాలు సాధించిన వైసీపీ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అన్నారు. పట్టభద్రులు కాని వారిని ఓటర్లుగా చేర్చి దొంగ ఓట్లు వేసినా, టిడిపి కార్యకర్తలు నాయకులు ప్రాణాలు ఒడ్డి విజయం సాధించారని నరేంద్ర కొనియాడారు.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులను బెదిరించి గెలుపులు సాధించడం కూడా ఒక విజయమేనా? రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూడా ఇదే తరహా తీర్పు ఇస్తారు… వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వరన్నారు ధూళిపాళ్ళ నరేంద్ర. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు ఘన విజయం సాధించారు. తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పశ్చిమ రాయలసీమలోనూ విజయం దోబూచులాడుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఈవిధంగా బయటపడిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇవి కౌంట్ డౌన్ లాంటివని టీడీపీ నేతలు చెబుతున్నారు.