ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ప్రతి కుటుంబానికి మెడికల్ ఇన్సూరెన్స్ ఉండటం మంచి విషయం. అయితే.. కుటుంబ క్షేమం కోసం మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకొని అత్యవసర సమయంలో దగ్గరలోని ఆసుపత్రికి వెళితే.. అక్కడ క్యాషలెస్ చికిత్స అందుబాటులో లేకపోత ఇబ్బంది తప్పదు. కాబట్టి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా ‘స్టాండర్డ్స్ అండ్ బెంచ్మార్క్స్ ఫర్ ది హాస్పిటల్స్ ఇన్ ది ప్రొవైడర్ నెట్వర్క్’ అంటూ బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ఇటీవల జారీ చేసిన కొత్త మార్గదర్శకాల గురించి తెలుసుకోవాలి. ఈ నెల 20న విడుదల చేసిన సర్క్యులర్లో.. బీమా సంస్థల నెట్వర్క్ పరిధిలో ఉన్న దవాఖానలు.. ఆయా సంస్థల బోర్డులు తీసుకున్న నిర్ణయాల మేరకు పనిచేయాల్సిందేనని స్పష్టం చేసింది ఐఆర్డీఏఐ.
దవాఖానల ఎంపిక సమయంలో కనీస సిబ్బంది, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకూ బీమా సంస్థల బోర్డులు ప్రాధాన్యత ఇవ్వాలని ఐఆర్డీఏఐ తెలిపింది. దీంతో ఆరోగ్య బీమా పాలసీదారులు తమ బీమా సంస్థ నెట్వర్క్ పరిధిలో ఉన్న దవాఖానలకు వెళ్లినప్పుడు అత్యున్నత ప్రమాణాలతో కూడిన చికిత్సను పొందడమే కాకుండా, క్యాష్లెస్ ట్రీట్మెంట్ను సదరు దవాఖాన యాజమాన్యాలు అందిచాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆమోదానికి దవాఖానల్లో పెద్ద గజిబిజి ప్రక్రియే కొనసాగేది. అయితే ఇప్పుడు ఐఆర్డీఏఐ తీసుకున్న నిర్ణయం పేద, మధ్యతరగతి వర్గాల్లో ఆరోగ్య బీమాపట్ల నమ్మకాన్ని పెంచగలదని బీమా పరిశ్రమలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి కార్పొరేట్ వైద్యం వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి బీమా కంపెనీలు.