హైదరాబాద్లోని గోల్కొండ కోట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. త్రివర్ణ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ.. ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. తెలంగాణ.. అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటోందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. బలమైన ఆర్థికశక్తిగా తెలంగాణ రూపొందిందని, అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు కేసీఆర్. సాగులో 11.6 శాతం వృద్ధిరేటు సాధించామని, గొర్రెల పెంపకంలో దేశంలో నంబర్ వన్గా నిలిచామన్నారు. గ్రామీణ జీవన విధానంలో అగ్రస్థానంలో నిలిచాం. 11.1 శాతం వృద్ధిరేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రస్థానంలో ఉన్నామని, దేశ నిర్మాణంలో బలమైన భాగస్వామిగా తెలంగాణ నిలిచిందన్నారు సీఎం కేసీఆర్. అంతేకాకుండా.. “వివిధ వర్గాల ఆదాయం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశంలో కరెంట్ కోతలు విధించని రాష్ట్రం తెలంగాణనే. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రతి వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం.
సంక్షేమంలో దేశంలో నంబర్ వన్గా తెలంగాణ నిలిచింది. నేటి నుంచి మరో 10 లక్షల మందికి ఆసరా పథకం కింద పింఛన్లు. రాష్ట్రంలో ఆసరా పింఛన్లు 46 లక్షలకు చేరుతాయి. దేశంలో ఎస్సీ వర్గం పట్ల నేటికీ వివక్ష కొనసాగుతోంది. ఎస్సీ వర్గాలు వెనుకబాటుకు చిరునామాలుగా మారుతున్నాయి. ఎస్సీల అభివృద్ధే ధ్యేయంగా దళితబంధు పథకం తెచ్చాం. దళితబంధు పథకం దేశానికి దిశానిర్దేశం చేస్తోంది. దళితబంధు పథకాన్ని సామాజిక ఉద్యమంగా అమలు చేస్తున్నాం. పథకం లబ్ధిదారుల భాగస్వామ్యంతో దళిత రక్షణ నిధి ఏర్పాటు. లబ్ధిదారులు ఆపదకు గురైతే ఆర్థికంగా నిలబెట్టేందుకు నిధి దోహదం. తెలంగాణ వృద్ధి రేటు దేశ వృద్ధిరేటు కంటే 27 శాతం అధికం. ఏడేళ్లలో వ్యవసాయం పరిమాణం 2.5 రెట్లు పెరిగింది. పారిశ్రామిక రంగం రెండు రెట్లు, సేవా రంగం 2.2 రెట్లు పెరిగాయి.” అని కేసీఆర్ అన్నారు.