సినీ నటి ఖుష్బూపై డీఎంకే నేత సైదైయ్ సాదిక్ వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీలోని ఖుష్బూ, నమిత, గౌతమి, గాయత్రీ రఘురామన్లు ఐటమ్స్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఖుష్బూ పెద్ద ఐటమ్ అంటూ మాట్లాడారు. అమిత్ షా తలమీద వెంట్రుకైనా మొలుస్తేందేమో కానీ.. తమిళనాడులో కమలం మాత్రం వికసించదన్నారు. డీఎమ్కే నేత మాటలపై సినీ నటి ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నానని డీఎంకే సీనియర్ నాయకురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోదరి కనిమొళి అన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోరని ఆమె చెప్పారు. ప్రముఖ నటి, భాజపా నేత ఖుష్బు సుందర్ ట్విటర్ ద్వారా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ‘‘ మహిళలను పురుషులు దుర్భాషలాడారంటే….వారు ఎలాంటి వాతావరణంలో పుట్టిపెరిగారో అర్థమవుతుంది. ఇలాంటివారే మహిళల గర్భాన్ని అవమానిస్తారు. ఇదేనా ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో విరాజిల్లుతున్న ద్రవిడ సంస్కృతి? అని ట్విటర్ వేదికగా కనిమొళి విమర్శలు గుప్పించారు.
అనంతరం డీఎంకే నేత సైదైయ్ సాదిక్ కూడా క్షమాపణలు చెప్పారు. ఏ నాయకుడిని బాధపెట్టాలని తాను ఉద్దేశించలేదని అన్నారు. కుష్బూతో సహా ఏ నాయకుడిని బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని, గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నానని సాదిక్ అన్నారు. అయితే బీజేపీ అధిష్టానం చేసిన వ్యాఖ్యలపై ఎవరూ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీఎన్బీజేపీ చీఫ్ అన్నామలై డీఎంకే మంత్రులను పందులు, జంతువులు అన్నారని.. జర్నలిస్టులను కోతులతో పోల్చాడని.. ఈ బీజేపీ నేతలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని అని సైదైయ్ సాదిక్ ప్రశ్నించారు. నమిత, ఖుష్బు సుందర్, గౌతమి, గాయత్రి రఘురామన్లను ఉద్దేశించి డీఎంకే నేత సైదైయ్ సాదిక్ తమిళనాడులో నటిగా మారిన బీజేపీ నేతలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది.